కరోనా వైరస్ను ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వైరస్ నియంత్రణకు కృషి చేస్తున్నారన్నారు. లాక్డౌన్ ప్రకటించడంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నందుకు అభినందించారు. రైతులు పండించిన పంటను ఇంటి వద్దనే మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు గోదాముల్లో నిల్వ ఉంచుకున్న పంటకు 70శాతం అడ్వాన్స్గా ఎలాంటి వడ్డీ లేకుండా డబ్బులు చెల్లిస్తామన్నారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలోని గడ్డిగూడెంలో తొలి కరోనా కేసు నమోదైందని, అతడి ద్వారా 200 మందికి సోకే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం, కంబాలపల్లి, దాట్ల, నేరడ, సండ్రగూడంతోపాటు ఏడు గ్రామాల్లో 26 మందికి వైద్య పరీక్షలు చేయగా ఇద్దరిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారన్నారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా రోడ్లపై తిరుగుతున్న 2000 వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇవ్వాలని, బయటకు వస్తే ఉపేక్షించేది లేదన్నారు. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో మంగళవారం నుంచి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరాం పాల్గొన్నారు.